ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా?: అంబటి రాంబాబు

  • ఉండవల్లి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంబటి
  • ఎస్పీ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారని అంబటి అసహనం
  • ఉండవల్లిలో తమపైనే ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని ఆరోపణ

ఉండవల్లి ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళితే ఆయన లేరని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ముందుగా అపాయింట్‌మెంట్ ఇచ్చి కూడా తీరా అక్కడికి వెళ్లాక ఆయన అందుబాటులో లేరని చెప్పారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉండవల్లి ఘటనలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ తలకు ఏకంగా 14 కుట్లు పడేలా తీవ్ర గాయమైందని, అంత జరిగినా పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అంబటి ప్రశ్నించారు. అక్కడ రాయి విసిరిన వ్యక్తి పేరు 'కిరణ్' అనే విషయం పోలీసులకు స్పష్టంగా తెలిసినప్పటికీ... నిందితుడిని ఇప్పటివరకు గుర్తించలేదంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.


ఉండవల్లిలో తమ పార్టీ శ్రేణులపైనే ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారని, కానీ పోలీసులు మాత్రం అన్యాయంగా తమపైనే రివర్స్ కేసులు పెట్టారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే స్వయంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి కూడా తాము మంత్రి నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా? అని అంబటి నిలదీశారు. ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లినా ఎస్పీ అందుబాటులో లేకుండా పోయారని.. చివరకు ఏఎస్పీకి వినతిపత్రం ఇవ్వాలని పోలీసులు సూచించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.


Ambati Rambabu
Nara Lokesh
YSRCP
Undavalli incident
Andhra Pradesh politics
Guntur SP

More Telugu News